హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ఎస్టీపీలు మంజూరు.. రూ.45 కోట్ల నిధులకు గ్రీన్ సిగ్నల్
హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల తరఫున కృతజ్ఞతలు

హుజురాబాద్, జూన్ 17(Zindagi9news): రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పెరుగుతున్న జనాభా, రోజువారీగా విడుదలవుతున్న మురుగు నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాలు (STPలు) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపుతూ సంబంధిత జీవోను విడుదల చేసింది.
ఈ విషయాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వెల్లడించారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో ఎస్టీపీ ప్లాంట్ల ఏర్పాటుకు మొత్తం రూ.45 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో హుజురాబాద్ మున్సిపాలిటీకి రెండు ఎస్టీపీలు, జమ్మికుంట మున్సిపాలిటీకి ఒక ఎస్టీపీని కేటాయించినట్లు చెప్పారు.
మురుగు నీటి శుద్ధీకరణ ప్రాజెక్టు అవసరాన్ని స్థానిక అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు మంజూరైనట్లు వొడితల ప్రణవ్ పేర్కొన్నారు.
మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. హుజురాబాద్, జమ్మికుంట ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
