కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ

కరీంనగర్, జూన్ 17(Zindagi9news): కరీంనగర్ జిల్లాలో గుర్తింపు పొందిన, విధుల్లో ఉన్న జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఎన్. ప్రసాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా కార్యదర్శి చేసిన వినతి మేరకు, జిల్లా కలెక్టర్ 2022లో జారీ చేసిన ఆదేశాలను ఆధారంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026-27 విద్యా సంవత్సరానికి పూర్తి ఫీజు రాయితీ అందించాలని డీఈవో సూచించారు.
ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, మండల విద్యాధికారులకు ఉత్తర్వుల ప్రతులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
