బ్యాంకు లాకర్లలో రూ.1.5 కోట్లు, 12 బంగారు బిస్కెట్లు స్వాధీనం

హైదరాబాద్, జూన్ 20(Zindagi9news): తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుపై నమోదైన అక్రమాస్తుల కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు శనివారం కీలక సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్లోని శాలిబండ కెనరా బ్యాంకు శాఖలో నరహరి రావు భార్య పేరుతో ఉన్న రెండు బ్యాంకు లాకర్లను కోర్టు అనుమతితో తెరిచి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.1.50 కోట్ల నగదు, 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు (మొత్తం 1.2 కిలోలు), అలాగే సుమారు 2 కిలోల బరువున్న బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే గుర్తించిన అక్రమాస్తులకు అదనంగా ఈ ఆస్తులు బయటపడినట్లు ఏసీబీ వెల్లడించింది. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తు దశలో ఉందని తెలిపింది. ప్రస్తుతం నిందిత అధికారి న్యాయస్థాన కస్టడీలో ఉన్నారు.
