ఏసీబీ వలలో డిప్యూటీ డైరెక్టర్.. పది చోట్ల సోదాలు, భారీ ఆస్తుల గుర్తింపు

హైదరాబాద్, జూన్ 16(Zindagi9news): తెలంగాణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసింది. విధుల్లో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలు, అనుచరులకు చెందిన మరో తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, పుప్పాలగూడలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నర్సింగిలో 1,860 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు ఫ్లాట్లు, రాజేంద్రనగర్లో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్కు సంబంధించిన పత్రాలు లభించాయి. అలాగే గచ్చిబౌలిలో జీ+3 భవనం, ఛత్రినాకలో జీ+2 భవనం ఉన్నట్లు గుర్తించారు.
ఇక నరహరి రావు నివాసంలో రూ.1.54 కోట్ల నగదు, రూ.2.29 కోట్ల బ్యాంకు నిల్వలు, రూ.5.04 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, సుమారు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన భార్య పేరిట ఉన్న రెండు లాకర్లను కూడా గుర్తించిన అధికారులు, దర్యాప్తులో భాగంగా వాటిని తెరవనున్నట్లు తెలిపారు. అదనంగా కియా కారెన్స్ స్మార్ట్స్ట్రీమ్ జీ1.5 6ఎంటీ కారును కూడా గుర్తించారు.
సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల పత్రాల విలువ రూ.13.05 కోట్లుగా అంచనా వేయగా, మార్కెట్ విలువ దీనికంటే అనేక రెట్లు అధికంగా ఉండవచ్చని ఏసీబీ పేర్కొంది. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, నిందిత అధికారిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది.
