లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్

నల్గొండ, జూన్ 19(Zindagi9news): నల్గొండ జిల్లా ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జి. పవన్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు సంబంధించిన భూముల సర్వే నివేదిక జారీ చేయడానికి రూ.35 వేల లంచం డిమాండ్ చేసిన పవన్ కుమార్, ముందుగా రూ.20 వేలు తీసుకోగా, మిగిలిన రూ.15 వేలు స్వీకరిస్తుండగా నల్గొండ కలెక్టరేట్ సమీపంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రూ.15 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్టు చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
ప్రజా సేవకులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే, ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
