లంచం తీసుకుంటూ టీజీఎస్పీడీసీఎల్ ఏఈ ఏసీబీ వలలో.. రూ.25 వేల నగదు స్వాధీనం

సంగారెడ్డి, జూన్ 18(Zindagi9news): సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) ఆపరేషన్స్ విభాగం అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ బి. రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో తన కార్యాలయం సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.25 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గత జూన్ 12న ఫిర్యాదుదారుడు కారు ప్రమాదంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి దెబ్బతీయగా, ఆ ఘటనపై ఎలాంటి చర్యలు ప్రారంభించకుండా ఉండేందుకు అనుకూలంగా వ్యవహరించాలంటే రూ.25 వేల లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
అధికారి వద్ద నుంచి రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, విధి నిర్వహణలో అవినీతి, అక్రమ ప్రయోజనం పొందే ఉద్దేశంతో వ్యవహరించినట్లు నిర్ధారించారు.
ఈ కేసులో బి. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.
