
రేపట్నుంచి కొత్త చరిత్ర మొదలవుతోంది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘‘రేపట్నుంచి జీఎస్టీ ఉత్సవం ప్రారంభం కానుంది. కొత్త చరిత్ర మొదలవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం నుంచి నూతన జీఎస్టీ శ్లాబ్ రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
2017లో జీఎస్టీతో దేశంలో కొత్త అధ్యాయం ఆరంభమైందని గుర్తుచేసిన మోదీ, అప్పటివరకు రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణా పన్నులు, టోల్లతో వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఎఫ్డీఐలను ప్రోత్సహించి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతాయని, దేశ వృద్ధిరేటుకు ఊతమిస్తాయని వివరించారు.
2024లో గెలిచిన తరువాత జీఎస్టీ సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చామని, వన్ నేషన్–వన్ టాక్స్ కలను సాకారం చేశామని మోదీ పేర్కొన్నారు. నూతన జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. కొన్నింటిపై పూర్తిగా పన్ను మినహాయింపు, మరికొన్నింటిపై కేవలం 5 శాతం పన్ను మాత్రమే విధించామని తెలిపారు.
రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను తొలగించామని, దీంతో మధ్యతరగతికి డబుల్ బొనాంజా లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. టీవీ, ఫ్రిజ్, స్కూటర్, గృహనిర్మాణం వంటి వాటిపై ఖర్చు తగ్గుతుందని వివరించారు.
చిన్న పరిశ్రమలు భారత ఆర్థిక బలోపేతానికి దిక్సూచిగా మారాయని మోదీ చెప్పారు. ‘‘స్వదేశీ వస్తువులను కొనండి, మన ఉత్పత్తులను ఉపయోగించామనే గర్వంగా చెప్పండి’’ అని పిలుపునిచ్చారు. ‘‘నాగరికత దేవోభవ’’ అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందని ప్రధాని స్పష్టం చేశారు.
