కన్న కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
ఉపాధ్యాయుల అప్రమత్తతతో బయటపడిన ఘటన
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బాలికను భరోసా కేంద్రానికి తరలింపు

వికారాబాద్, జూలై 30 (Zindagi9News): వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బాలికపై ఆమె తండ్రే లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు మొబైల్ ఫోన్లో అసభ్యకర చిత్రాలు, వీడియోలు చూపిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాఠశాలలో బాలిక అసాధారణంగా ప్రవర్తించడం గమనించిన ఉపాధ్యాయులు ఆమెతో మాట్లాడగా, జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.
బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను భరోసా కేంద్రానికి తరలించి అవసరమైన సంరక్షణ, కౌన్సెలింగ్ అందిస్తున్నారు. ఈ ఘటన ఈ నెల 27న జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
