తిరుమలలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబును కలిసిన హుజూరాబాద్ నేత దొంత రమేష్

నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి
హుజూరాబాద్: నూతన సంవత్సర 2026 సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును హుజూరాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.
శ్రీవారి దర్శనానంతరం తిరుమలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబును కలిసిన దొంత రమేష్ పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో కొద్దిసేపు చర్చించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేలా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఈ దిశగా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ నాయకత్వంలో సమన్వయంతో పని చేసి రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని దొంత రమేష్కు మార్గనిర్దేశం చేశారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త ఏడాది సుఖసంతోషాలు తీసుకురావాలని, ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు సాగాలని దొంత రమేష్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ భేటీ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతానికి తాము చేస్తున్న కృషిని దొంత రమేష్ మంత్రులకు వివరించారు. స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కార్యకర్తలకు అండగా నిలుస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
