హ్యాపీ న్యూ ఇయర్ రేవంత్ అన్న.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరాలి – మేయర్ పీఠం దక్కించుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి సూచన
కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కరీంనగర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై పలు అంశాలను సీఎం తో చర్చించారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 20 గ్రామాలు ఉండగా, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 11 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులను తానే గ్రౌండ్లో ఉండి గెలిపించానని రాజేందర్ రావు ముఖ్యమంత్రికి వివరించారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు నిరంతరం పని చేశానని తెలిపారు. అర్ధరాత్రి వరకూ ప్రచారం నిర్వహిస్తూ, అన్ని విధాలుగా అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచి విజయాన్ని సాధించానని పేర్కొన్నారు.
కరీంనగర్ నగరం, రూరల్, కొత్తపల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను గ్రౌండ్లో పనిచేస్తున్నానని రాజేందర్ రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు సీఎం రేవంత్ రెడ్డి రాజేందర్ రావును ప్రత్యేకంగా అభినందించారు. ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ వెన్నుతట్టి ప్రోత్సహించారు.
ఇదే స్ఫూర్తితో కరీంనగర్ నగర పాలక సంస్థపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం లక్ష్యంగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకునేలా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు రాజేందర్ రావు తెలిపారు.
నూతన సంవత్సర వేళ పార్టీ బలోపేతంతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన విజయాలను ప్రశంసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహించడంపై ఆనందం వ్యక్తం చేసినట్లు రాజేందర్ రావు పేర్కొన్నారు.
