
జూలూరుపాడు మండలంలో ఉపాధి హామీ పథకంలో అవినీతిపై ఫిర్యాదు
జూలూరుపాడు, సెప్టెంబర్ 17 (జిందగీ9న్యూస్ రిపోర్టర్: రాము): జూలూరుపాడు మండలంలోని 24 గ్రామపంచాయతీలకు సంబంధించిన జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి, అక్రమాలపై భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ – గ్రామపంచాయతీలకు సమాచారం ఇవ్వకుండా మండల ఏపీఓ, ఈసీ పదవులు ఉపయోగించుకుని ఎంపీడీవో సహకారంతో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు.
2023–24, 2024–25 నర్సరీ పనులు, నేమ్బోర్డుల పనుల విషయంలో – ఏపీవో సొంత తమ్ముడు డాక్టర్ రత్నకుమార్, జగ్గయ్య, టీ.ఏ భార్య సోదరి శ్రావణి, గద్దెల స్వర్ణలత పేర్లపై తప్పుడు పేమెంట్లు జరిగాయి అని ఆయన తెలిపారు.
అలాగే –
🔸గ్రామాల్లో క్షేత్రస్థాయిలో జరగని పనులకు కూడా ఉపాధి హామీ నిధులు వాడటం,
🔸మొక్కలకు కర్రలు పెట్టకుండానే స్టిక్ పేమెంట్ చేయడం,
🔸నేమ్బోర్డు లేకుండానే వర్క్ ఐడీలతో సొంత ఖాతాల్లోకి నిధులు మళ్లించడం,
🔸ఐదుగురు టీ.ఏల ఖాతాల్లోనూ డబ్బులు జమ చేయడం జరిగినట్లు ఆయన వివరించారు.
ఈ అక్రమాలపై జిల్లా అధికారులు రెండు రోజులపాటు విచారణ జరిపినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిపిఎస్ ఫోటోలు సహా సాక్ష్యాలను సమర్పించినా అధికారులు నిర్లక్ష్యం వహించారని దుర్గాప్రసాద్ నాయక్ ఆరోపించారు.
తప్పుడు పేమెంట్లను వెంటనే రికవరీ చేసి ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, సంబంధిత ఏపీఓ, ఎంపీడీవో, టీ.ఏలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
