హరితహారం బిల్లు కోసం లంచం ఆశించి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఫారెస్ట్ ఆఫీసర్!

బోథ్, ఏప్రిల్ 09(zindagi9news): నిర్మల్ జిల్లా బోథ్ అటవీ శాఖ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. హరితహారం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO), ఆయన సహాయకుడిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద నిర్వహించిన ‘హరితహారం’ ప్రాజెక్టుకు ఫిర్యాదుదారుడు నీటిని సరఫరా చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నుంచి రావాల్సిన రూ. 5,09,000 ల బకాయి చెక్కును మంజూరు చేయాలని ఫిర్యాదుదారుడు బోథ్ ఎఫ్ఆర్ఓ టి. ప్రణయ్ను కోరారు. అయితే, ఆ చెక్కును క్లియర్ చేసేందుకు ఎఫ్ఆర్ఓ రూ. 15,000 లంచం డిమాండ్ చేశారు.
ఏసీబీ పక్కా ప్లాన్
లంచం ఇవ్వడం ఇష్టం లేని ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు గురువారం బోథ్ రేంజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎస్. పరశురాం ద్వారా ఎఫ్ఆర్ఓ ప్రణయ్ లంచం తీసుకుంటుండగా, మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
