
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ
హైదరాబాద్: అవినీతి నిరోధకశాఖ (ACB) మరోసారి అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపింది. ఆర్.జి.ఐ. ఎయిర్పోర్ట్ పోలీస్ అవుట్పోస్ట్కు చెందిన ఇన్స్పెక్టర్ సంపాతి కనకయ్య, ఎస్.ఐ. యు.కె. సిద్ధేశ్వర్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఒక కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం, అలాగే ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యులను అరెస్టు చేయకుండా ఉండేందుకు ఈ ఇద్దరు అధికారులు రూ.5,00,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు ACB అధికారులు ఉచ్చుపన్నీ చర్య చేపట్టి, అందులో భాగంగా రూ.2,00,000 లంచం స్వీకరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఇన్స్పెక్టర్ కనకయ్య నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.33,97,000 నగదు, అలాగే పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తులపై ప్రస్తుతం ACB అధికారులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.
