కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి..
నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..
ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు సీఎం రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యం
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్ ఫిబ్రవరి 10:ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ గ్రామానా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు నరేందర్ రెడ్డి కి అత్యధికంగా ఓట్లు పడేలా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. నరేందర్ రెడ్డి గెలుపునకు తన శాయశక్తుల అహర్నిశలు పాటుపడతానని పేర్కొన్నారు.
సోమవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ విద్యావేత్త విద్యా వ్యవస్థ పై పట్టు కలిగిన నరేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు పట్టం కట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరంతరం అండగా నిలుస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగ సమస్య, పట్టభద్రులు సమస్యలు పరిష్కారం అవుతాయని, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు పట్టభద్రులంతా సహకరించాలని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు నిరుద్యోగులను అవసరానికి వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. అలాగే బిజెపి నాయకులు పట్టభద్రుల సమస్యలను ఏ ఒక్కటి పరిష్కరించలేదని విమర్శించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే బీఆర్ఎస్, బిజెపి నేతలు కొత్త కొత్త హామీలు ఇస్తూ పట్టభద్రులపై తెగ ప్రేమ ఉలకబోస్తున్నారని పేర్కొన్నారు. వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు నమ్మే పరిస్థితులు లేరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశారని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవు అని తెలిపారు. కమిట్మెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించేందుకు పట్టభద్రులు కంకణబద్ధులై ఉన్నారని రాజేందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంతోనే నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బిజెపి మోసపూరిత హామీలను, ప్రకటనలను నిరుద్యోగులు, పట్టభద్రులు నమ్మవద్దని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.
