కరీంనగర్ అభివృద్ధిలో నెంబర్ వన్ చేయడమే లక్ష్యం – బండి సంజయ్

వీణవంక, గండ్రపల్లిలో రూ.1.56 కోట్లు విలువైన సీసీ రోడ్లకు శంకుస్థాపన
కరీంనగర్: గత ఆరేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చినట్లు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తీసుకొచ్చి
అభివృద్ధిలో కరీంనగర్ను నెంబర్ వన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా
రూ.78 లక్షలతో నిర్మించిన 18 అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట మండలంలోని
గండ్రపల్లి, ఇతర గ్రామాల్లో మరో రూ.78 లక్షల వ్యయంతో నిర్మించిన 13 రోడ్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ – “రాష్ట్రాభివృద్ధికి రాజకీయాలను పక్కనపెట్టి
అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేస్తున్నా. రోడ్ల అభివృద్ధికి ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం అధిక
ప్రాధాన్యతనిస్తోంది. CRIF నిధుల కింద రూ.291 కోట్లతో 1341 కిలోమీటర్ల రోడ్లను నిర్మించాం.
గత ఆర్థిక సంవత్సరంలో NREGS కింద రూ.31.13 కోట్లతో పనులు జరిగాయి. ఇప్పటివరకు NREGS ద్వారా
మొత్తం రూ.650 కోట్లు ఖర్చు చేశాం” అని వివరించారు.

“జాతీయ రహదారుల విస్తరణకు రూ.5 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేశాం. కరీంనగర్-వరంగల్,
సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలో కరీంనగర్-జగిత్యాల
రోడ్డుకు కూడా టెండర్లు పిలవబోతున్నాం” అని వెల్లడించారు.
“ఎన్నికల వరకు రాజకీయాలు – ఎన్నికల తరువాత అభివృద్ధే మా ధ్యేయం. ప్రజల సంక్షేమానికి
ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ప్రజల అభ్యున్నతే మా లక్ష్యం” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
