కోరుట్లలో మిస్టరీగా ఐదేళ్ల హితీక్ష మృతి – హత్యా? ప్రమాదమా?
కోరుట్ల, జగిత్యాల జిల్లా:

కోరుట్ల పట్టణం ఆదర్శనగర్లో ఐదేళ్ల చిన్నారి హితీక్ష అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మిస్టరీగా మారింది. ఓ ఇంటి బాత్రూంలో ఆమె మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో తొలుత హత్యకు గురై ఉండవచ్చని అనుమానాలు వెల్లువెత్తాయి.
నిన్న సాయంత్రం పెద్దపులుల విన్యాసాలు చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లిన హితీక్ష, భయంతో పారిపోయి బాత్రూంలో దాక్కుందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె కాలుజారి నల్లాపై తల బలంగా తగలడంతో మృతి చెందినదై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఇదే సమయంలో అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తిపై హత్యకు పాల్పడ్డాడన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. సైకోపతిక్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
చిన్నారి తండ్రి రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటున్నారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్థానికులు ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ చిన్నారుల భద్రతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.
