
ప్రజావాణికి 352 దరఖాస్తులు – శాఖల వారీగా సమీక్ష: కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్: జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 352 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమ పరిధిలో లేని దరఖాస్తులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని, దరఖాస్తులను పెండింగ్లో ఉంచవద్దని చెప్పారు.
ప్రజావాణికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి కలెక్టర్ స్వయంగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
