
కారు ఢీకొట్టిన ఆవు – 1962 సేవలు అందకపోవడంపై నిరసనలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఓ కారు రోడ్డుపై సంచరిస్తున్న ఆవును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు వెటర్నరీ టోల్ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేశారు. అయితే “సర్వీస్ టైం ముగిసింది” అని సమాధానం రావడంతో, బాధితులకు సహాయం అందకపోయింది. దాంతో వారు ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్ను పిలిపించి చికిత్స అందించారు.
ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ, “జీవాలు ఏవైనా ప్రాణాలు ఒకటే. మానవులకు 108 సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటే, పశువులకు 1962 సేవలు కూడా అదే తరహాలో ఉండాలి” అంటూ డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు తక్షణం స్పందించి, 1962 సేవలను పూర్తి స్థాయిలో 24×7 అందుబాటులో ఉంచాలని, పశు రక్షణను ప్రాధాన్యంగా తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
