పిల్లల వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
– జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా అతహరి

జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వావిలాల ఆరోగ్య ఉపకేంద్రాన్ని జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా అతహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి, వాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. వాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ వ్యవస్థను పరిశీలించారు.
తల్లి పాల ప్రాముఖ్యతను వివరించిన ఆమె, వర్షాకాలంలో పిల్లలకు వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని అవగాహన కల్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వాక్సిన్ రూమ్, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి వైద్య సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ సాయికుమార్, ల్యాబ్ టెక్నీషియన్ రామక్రిష్ణ, ANM రమ, ఆశా కార్యకర్తలు సుమలత, రమ, లక్ష్మి, మల్లేశ్వరి పాల్గొన్నారు.
