
ఎగువ మానేరు వద్ద చిక్కుకున్న ఏడుగురికి క్షేమం – అధికారుల ముమ్మర చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టులో చిక్కుకున్న ఏడుగురిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు జంగం స్వామి, పిట్ల స్వామి, పిట్ల మహేష్, పిట్ల నర్సింలు, ధ్యానబోయిన స్వామి, బిసే ప్రదీప్, బిసే ఛాయా అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చిక్కుకున్న వారికి ఆహార సదుపాయాలు కల్పించి, సైనిక హెలికాప్టర్ల సహాయంతో సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

ఈ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరిపారు. గురువారం ఉదయం కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలిలో ఉండి పరిస్థితిని గమనించగా, అనంతరం బండి సంజయ్ స్వయంగా అక్కడికి చేరుకొని రక్షితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ — “కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే విశేష కృషి చేశారు. వారి సమన్వయం వల్లే రక్షణ చర్యలు విజయవంతమయ్యాయి” అని అభినందనలు తెలిపారు.
ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న ఏడుగురు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.

