జమ్మికుంట, ఫిబ్రవరి 4, 2025 (Zindagi9news – ప్రత్యేక ప్రతినిధి) : జమ్మికుంటలో భూకబ్జా వివాదం తీవ్ర ఉద్రిక్తత రేపింది. స్థానిక వ్యాపారి ఎండి ఆరిఫ్ ఉద్దీన్ (34) ఫిర్యాదు మేరకు కాటిపల్లి రాజు, కాటిపల్లి సంధ్య, కాటిపల్లి లక్ష్మి, షేక్ షబ్బీర్ అలీ, అంబాల రాజు పై పోలీస్ కేసు నమోదైంది.
బాధితుడి ప్రకారం, ఆయన 2023 డిసెంబర్ 6న సర్వే నం. 464 లోని ఫ్లాట్ నం. 4 ను మొగిలి లింగారెడ్డి నుండి కొనుగోలు చేసి, తన భార్య ఉమ్మే రూమాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఫ్లాట్ హద్దులను స్పష్టంగా పాతుకున్నప్పటికీ, ఫిబ్రవరి 3న ఉదయం 9 గంటల సమయంలో నిందితులు అక్రమంగా ఫ్లాట్లోకి ప్రవేశించి, హద్దురాళ్లు తొలగించి, టెంట్ వేసుకున్నారు.
ఈ వ్యవహారంపై ఆరిఫ్ ఉద్దీన్ ప్రశ్నించగా, నిందితులు బూతులు తిడుతూ ప్రాణహాని ముప్పు కలిగించేలా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, మీడియా ముందుగా ప్రెస్ మీట్ పెట్టి తాము భూమి యజమానులమని తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితుడు వాపోయాడు.
ఈ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. భూకబ్జా కేసు మరింత ముదిరే అవకాశం ఉండడంతో, సంబంధిత అధికారి సత్వర చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.
