హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కృత్రిమ మేథస్సు (AI) ఆధారంగా రూపొందించిన ఫేక్ వీడియోలు, ఫొటోలతో భూవివాదాన్ని కృత్రిమంగా సృష్టిస్తున్న ప్రయత్నాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫేక్ కంటెంట్ మహమ్మారి – కరోనా కన్నా ప్రమాదకరం!
సమావేశంలో ఫేక్ వీడియోలు, ఫొటోల వల్ల సమాజం తప్పుదోవ పట్టే ప్రమాదముందని, ఇవి కరోనా వైరస్ను మించిన మహమ్మారి లాంటివని అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టులో విచారణకు విజ్ఞప్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
25 ఏళ్లుగా అభివృద్ధి – ఇప్పుడు వివాదం ఎందుకు?
సర్వే నెంబర్ 25 పరిధిలో గత 25 ఏళ్లుగా ISB, Gachibowli Stadium, IIIT, Hyderabad University భవనాలు, ప్రైవేటు అపార్టుమెంట్లు నిర్మాణం జరిగినట్టు అధికారులు వివరించారు. అప్పట్లో ఎటువంటి వన్యప్రాణుల, పర్యావరణం భగ్నం ఆరోపణలు లేనని పేర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై అభివృద్ధికి వ్యతిరేకంగా వివాదం ఎందుకు రావాలో చర్చించారు.
ఏఐ ఫేక్ వీడియోల వల్ల జాతీయ స్థాయిలో చర్చ
ఫేక్ కంటెంట్ కారణంగా ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు వెల్లడించారు. నెమళ్లు ఏడుస్తున్నట్లుగా, జింకలు బుల్లోజర్ల వల్ల గాయపడ్డట్లుగా రూపొందించిన ఫేక్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు చెప్పారు.
ప్రముఖుల పోస్ట్లు – అబద్ధాలకు ఆజ్యం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ నటులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ వంటి ప్రముఖులు కూడా ఈ ఫేక్ కంటెంట్ను నిజమని నమ్మి పోస్ట్ చేయడం వల్ల తప్పుడు సందేశాలు సమాజానికి చేరాయని పేర్కొన్నారు. జర్నలిస్ట్ సుమిత్ ఝా తన పోస్ట్ తొలగించి క్షమాపణలు చెప్పినప్పటికీ, మిగిలిన ప్రముఖులు మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదని అధికారులు వెల్లడించారు.
ప్రజాస్వామ్యానికి సవాలు – భవిష్యత్తులో భయానక పరిణామాలు?
ఏఐ ఆధారంగా సృష్టిస్తున్న ఫేక్ కంటెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను సవాలు విసురుతోందని, ఇదే తరహాలో సరిహద్దు సమస్యలపై ఫేక్ కంటెంట్ సృష్టిస్తే యుద్ధ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
సైబర్ భద్రతకు శక్తివంతమైన చర్యలు
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, ఏఐ ఫేక్ కంటెంట్ను గుర్తించేందుకు ఆధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సీఎం ఆదేశించారు.
