
ఉత్సాహంగా ముగిసిన అల్ఫోర్స్ క్రికెట్ ఛాంపియన్షిప్
విజేతగా అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ కొత్తపల్లి
కరీంనగర్: విద్యార్థులకు క్రీడలు తప్పనిసరిగా ఉండాలని, క్రీడల ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎస్ఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత రెండు రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన అల్ఫోర్స్ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక అభివృద్ధి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి విజయాలు సాధించడం సులభమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొని నైపుణ్యం పెంపొందించుకోవాలని, వివిధ స్థాయిల్లో నిర్వహించే పోటీల్లో ప్రతిభ చాటాలని సూచించారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించి, వాటిలో పాల్గొనేందుకు అవసరమైన వనరులు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
గత రెండు రోజులుగా జరిగిన అల్ఫోర్స్ క్రికెట్ ఛాంపియన్షిప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ కొత్తపల్లి విజేతగా నిలిచిందని ప్రకటించారు. విజేత జట్టుతో పాటు అన్ని జట్ల సభ్యులకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
