30 ఏళ్ల జర్నలిజం సేవలకు గుర్తింపు: సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం

సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం లభించింది. గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ ప్రకటించింది.
సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్ ఎంపిక చేసిన ఈ అవార్డును హైదరాబాద్లోని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థల వ్యవస్థాపకులు, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ మరియు అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ గ్రహీత కదరి వెంకటరమణరావు, ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, ఫిలిం ఆర్టిస్టు ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీరామ్ తదితరులు పాల్గొన్నారు. వారు శాలువా కప్పి, స్మారక చిహ్నంతో పాటు సర్వోత్తమ సేవ పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మండల యాదగిరి మూడు దశాబ్దాలుగా నిస్వార్థంగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పత్రికా రంగంలో అందిస్తున్న సేవలు అమూల్యమని ప్రశంసించారు. వృత్తి పరంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ, మానవతా విలువలు పెంపొందించే దిశగా ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమన్నారు. ఇలాంటి నిరంతర సేవా తత్పరత మరెందరికో ప్రేరణగా నిలుస్తుందన్నారు.
అలాగే, యాదగిరి జర్నలిస్టుగా మరిన్ని సంవత్సరాలు సేవలందించి ప్రజలతో పాటు ప్రభుత్వ గుర్తింపును కూడా పొందాలని, భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, సత్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. పత్రికా రంగంలో పాతికేళ్లకు పైగా సేవ చేసిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం జీవనోపాధి భద్రతతో పాటు ఆర్థిక సహాయం కల్పించాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు.
