టేకుమట్లలో నూతన తహసీల్దార్ స్వరూప రాణికి ఘన స్వాగతం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో నూతన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన స్వరూప రాణిని మీసేవ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జిల్లాలో జరిగిన తహసీల్దారుల బదిలీలలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 12 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ విజయలక్ష్మి కాటారం మండలానికి బదిలీ కాగా, ఆమె స్థానంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో విధులు నిర్వహిస్తున్న స్వరూప రాణిని టేకుమట్ల తహసీల్దార్గా నియమించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం టేకుమట్ల మండల మీసేవ నిర్వాహకులు స్వరూప రాణిని కలిసి శాలువాతో సన్మానించి, స్వీట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వరూప రాణి మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, ఆర్ఐ సంతోష్ కుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, మీసేవ నిర్వాహకులు బుర్ర ధనుంజయ్, పెద్దోజు రమణాచారి, దూడం రవి, శ్రీపతి రాకేష్, అంబుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
