
వరుస విషాదాలతో జమ్మికుంట ఉక్కిరిబిక్కిరి: వారం వ్యవధిలో ముగ్గురు మృతి
జమ్మికుంట, మార్చి 16 (Zindagi9News):
జమ్మికుంట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా చోటుచేసుకుంటున్న వరుస మరణాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. వేర్వేరు కారణాలతో ముగ్గురు వ్యక్తులు తమ జీవితాలను ముగించడం కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మూడు ఘటనలు ఇలా ఉన్నాయి:
1. మనస్తాపంతో గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం
జమ్మికుంట పట్టణానికి చెందిన వడ్లకొండ విజయ్ కృష్ణ (40) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం జమ్మికుంట రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. మృతుడు అరటి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. గత కొంతకాలంగా ఆయన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేయిస్తున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రామగుండం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2. ఫ్లైఓవర్ నుంచి దూకి హైదరాబాద్ యువకుడి మృతి
మరో ఘటనలో, జమ్మికుంట ఆర్ఓబీ (ROB) ఫ్లైఓవర్ పైనుంచి దూకిన ఒక యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని హైదరాబాద్కు చెందిన రాం శివరాజ్ (28)గా పోలీసులు గుర్తించారు. ఆరు నెలల క్రితం హుజూరాబాద్కు వచ్చి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఇతడు, మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
3. రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఇదే వారంలో సోమవారం ఉదయం జరిగిన మరో విషాదకర ఘటనలో, రైల్వే పట్టాలపై సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు గల ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది.సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుడిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు.ఇది ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
