
- ప్రపంచవ్యాప్తంగా ఎబోలా కలకలం: డబ్ల్యూహెచ్ఓ హై అలర్ట్.. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక ట్రావెల్ అడ్వైజరీ!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండాలలో ఎబోలా వ్యాధి (ముఖ్యంగా ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్) తీవ్రంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రంగంలోకి దిగింది. మే 17న జరిగిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల కమిటీ సమావేశంలో, ఈ ఎబోలా వ్యాప్తిని “అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి” (PHEIC) గా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అటు ఆఫ్రికా సీడీసీ (Africa CDC) కూడా దీనిని ఖండాల భద్రతకు ముప్పుగా భావిస్తూ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది.
కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు:
ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశ పౌరులకు కీలకమైన ప్రయాణ మార్గదర్శకాలను (Travel Advisory) జారీ చేసింది.
ఆ దేశాలకు ప్రయాణాలు వద్దు: అత్యవసరమైతే తప్ప భారత పౌరులెవరూ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, మరియు సౌత్ సూడాన్ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
అక్కడ ఉన్న భారతీయులకు అలర్ట్: ఇప్పటికే ఆయా దేశాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణాల్లో ఉన్న భారతీయ పౌరులు అక్కడి స్థానిక ఆరోగ్య అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎయిర్పోర్టుల్లో నిఘా: విదేశాల నుండి, ముఖ్యంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులలో ఎవరికైనా వివరించలేని జ్వరం లేదా అనారోగ్య లక్షణాలు ఉంటే ఎంట్రీ పాయింట్ల (విమానాశ్రయాలు, రేవుల) వద్దే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ కమిటీ మే 22న సిఫార్సు చేసింది.
భారత్లో పరిస్థితి ఏంటి?
ప్రస్తుతానికి భారతదేశంలో ఈ ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ ఎబోలా వైరస్ కి సంబంధించిన ఎలాంటి కేసు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని పేర్కొంది.
ఏంటి ఈ బుండిబుగ్యో ఎబోలా?
ఇది ఎబోలా వైరస్ లో ఒక రకమైన స్ట్రెయిన్. ఇది సోకితే తీవ్రమైన రక్తస్రావ జ్వరం వస్తుంది. దీని వల్ల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే… ప్రస్తుతం ఈ ‘బుండిబుగ్యో’ ఎబోలా స్ట్రెయిన్కు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట వ్యాక్సిన్లు గానీ, చికిత్సలు గానీ అందుబాటులో లేవు. కాబట్టి నివారణే ఏకైక మార్గమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
