
రైలు నుండి పడి బీహార్ యువకుడి మృతి
పెద్దపల్లి: బతుకుదెరువు కోసం వలస వెళ్తున్న ఓ యువకుడు రైలు ప్రమాదంలో మరణించాడు. బీహార్ రాష్ట్రం ఆసన్ గ్రామానికి చెందిన ఆఫరోజ్ అన్సారీ (21) తన తమ్ముళ్లు, స్నేహితుడితో కలిసి సూర్యాపేటలో కూలీ పని కోసం సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడు.
ఆదివారం రాత్రి పోత్కపల్లి రైల్వే గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుండి కింద పడటంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియల నిమిత్తం మృతుని తమ్ముడు ఫర్హాన్ అన్సారీకి అప్పగించారు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
