రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్

నల్గొండ, జూన్ 6: నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహ్మూద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. అధికారిక అనుకూలత చూపించి నివేదిక సమర్పించేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.10 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులు శనివారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పెద్దవూర మండలానికి చెందిన జామే మస్జిద్ అబూబకర్ సిద్ధిక్ రహ్మతుల్లా అలై ఆస్తిని వక్ఫ్ బోర్డు రికార్డుల్లో నమోదు చేసే అంశంపై హైదరాబాద్లోని వక్ఫ్ బోర్డు సీఈఓకు వాస్తవ నివేదిక సమర్పించేందుకు ఫిర్యాదుదారుని నుంచి ఇన్స్పెక్టర్ షేక్ మహ్మూద్ రూ.10 వేల లంచం కోరినట్లు ఏసీబీ వెల్లడించింది.
అధికారి వద్ద నుంచి రూ.10 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు నిర్ధారించారు.
అనంతరం నిందిత అధికారిని అరెస్టు చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది.
