పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో కీలక పరిణామాలు.. బీహార్లో మరో నిందితుడు అరెస్ట్

కరీంనగర్: కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పోయిన బంగారం, వజ్రాల ఆభరణాలకు సంబంధించి నిందితులు తమ వాంగ్మూలాలను మార్చుతూ పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదివారం వెల్లడించారు.
నాలుగు రోజుల పోలీసు కస్టడీలో భాగంగా నిందితులను విచారించగా, వెలిచాల బైపాస్ సమీపంలోని పొదల్లో దాచిపెట్టిన రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అటవీ ప్రాంతం సమీపంలో పడేసిన ఒక మొబైల్ ఫోన్ను కూడా రికవరీ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఏ-10గా ఉన్న మరో కీలక నిందితుడిని బీహార్లో అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై కరీంనగర్కు తరలిస్తున్నారు.
పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుండగా, దోపిడీకి గురైన బంగారు, వజ్రాల ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించే అవకాశముందని పోలీసులు తెలిపారు.
