సీఎం సభ కోసం బస్సుల మళ్లింపు.. కరీంనగర్ జిల్లాలో ప్రయాణికుల అవస్థలు

కరీంనగర్, జూన్ 1(Zindagi9news): కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి మళ్లించడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీఎం సభకు ప్రజలను తరలించేందుకు వివిధ డిపోల నుంచి బస్సులను కేటాయించడంతో సాధారణ సర్వీసులు తగ్గిపోయాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి సాయంత్రం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కాగజ్నగర్ ఎక్స్రోడ్స్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

