గ్రామీణ తెలంగాణకు హై-స్పీడ్ ఇంటర్నెట్పై సీఎం రేవంత్ ఫోకస్
అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రామ్ అమలుపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, మే 27: తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రామ్ (ABP) అమలుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరిపారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, కార్యక్రమం వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించారు.
ఈ సందర్భంగా ప్రోగ్రామ్కు సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడం, పెండింగ్లో ఉన్న నిధులను సత్వరం విడుదల చేయాలని సీఎం కోరారు. తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రితో సమగ్రంగా చర్చించారు.
మండలాల నుంచి గ్రామ పంచాయతీల వరకు ఉన్న రింగ్ నెట్వర్క్ వ్యవస్థలను డిజిటల్ భారత్ నిధి (Digital Bharat Nidhi)కి బదిలీ చేసే విషయంలో స్పష్టమైన విధానం అవసరమని సీఎం సూచించగా, కేంద్ర మంత్రి సింధియా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి నాణ్యమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీ-ఫైబర్ నెట్వర్క్ను రింగ్ ఆర్కిటెక్చర్ రూపంలో విస్తరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. ఒక మార్గంలో నెట్వర్క్ అంతరాయం కలిగినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు కొనసాగేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.
అమెండెడ్ భారత్నెట్ ప్రోగ్రామ్లో భాగంగా తెలంగాణ ప్రత్యేక ప్రయోజన వాహనం (SPV) ఏర్పాటు చేసి కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర గ్రామీణ అవసరాలకు అనుగుణంగా విస్తృత హై-స్పీడ్ నెట్వర్క్ అభివృద్ధి చేసేందుకు ఇది దోహదపడనుంది.
మొదటి దశలో నెట్వర్క్ దెబ్బతిన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డి. అనుదీప్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
