
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం.. జూన్ 2న ప్రారంభం
ఖమ్మం, మే 13 (Zindagi9News): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రెండో విడతకు జూన్ 2న శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెర్వులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలకు గృహాల కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తొలి విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, రెండో విడతలో మరిన్ని అర్హ కుటుంబాలకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
