
జూలూరుపాడు, మే 17(zindagi9news): జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలో జరిగిన విషాదకర ఘటనలో ఐదు పశువులు విద్యుత్ తీగల కిరాతకానికి బలయ్యాయి. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన సూర్య, లక్ష్మి, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు లకు చెందిన పశువులు పంట పొలాల్లో మేత మేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
రెండు ఎడ్లు పోట్లాడుతూ సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాయి. ఈ ఘటనతో స్తంభం విరిగి, విద్యుత్ తీగలు తెగిపోయి పక్కనే ఉన్న మూడు ఆవులపై పడడంతో ఆవులు మరియు పోట్లాడిన రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. మొత్తం ఐదు పశువులు మరణించడంతో యజమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పశువుల మృతదేహాల వద్ద రోదిస్తున్న యజమానులను చూసి గ్రామస్తుల కళ్లు తడి అయ్యాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు.
