“మోదీ గిఫ్ట్”గా టెన్త్ ఎగ్జామ్ ఫీజులు భరించనున్న బండి సంజయ్

టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ నజరానా
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫీజును పూర్తిగా తన వేతనం ద్వారా చెల్లించనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. “మోదీ గిఫ్ట్” పేరుతో ఈ పథకం అమలులోకి రానుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపించారు.
మొత్తం 12,292 మంది విద్యార్థులు — కరీంనగర్ జిల్లాలో 4,847, సిరిసిల్లలో 4,059, సిద్దిపేటలో 1,118, జగిత్యాలలో 1,135, హన్మకొండలో 1,133 మంది — ఈ సదుపాయం పొందనున్నారు. పరీక్ష ఫీజుల కోసం సుమారు రూ.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా.
పేద కుటుంబాల పిల్లలకు విద్యాసహాయం అందించాలన్న ఉద్దేశంతో బండి సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, ఇప్పటికే “మోదీ గిఫ్ట్” పేరుతో 20 వేల మందికి పైగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. త్వరలో 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్ల పంపిణీ చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సర ఆరంభంలో ‘మోదీ కిట్స్’ రూపంలో బ్యాగ్లు, నోట్బుక్స్, పెన్నులు, జామెట్రీ బాక్స్, వాటర్ బాటిల్స్ కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
