
జలదుర్గం గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలి – కాంగ్రెస్ పార్టీ డిమాండ్
ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు సి. నాగరాజు, ఖాజా హుస్సేన్, నంద్యాల జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సి. మధు గ్రామ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో వ్యవసాయ బోర్లు ఎండిపోవడంతో పాటు పనులు లేక రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కుటుంబ అవసరాల కోసం ప్రైవేట్ లోన్లు, పొదుపు నిధుల నుంచి తీసుకున్న రుణాలకు కంతులు కట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేకపోవడంతో పలువురు కార్మికులు హైదరాబాద్, రాజంపేట, గుంటూరు ప్రాంతాలకు మిరపకాయల తోటల్లో పనుల కోసం వలస వెళ్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా జలదుర్గం గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభించకపోతే ధర్నా చేపడతామని నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.

