హైదరాబాద్, మార్చి 9: జగద్గిరిగుట్టలో 17 దేవాలయాలకు నోటీసులు జారీ చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. హైడ్రా అధికారులు ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, స్థానిక భక్తులు, పూజారులు తీవ్రంగా స్పందించారు.
ఈ విషయంలో బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నేరుగా దేవాలయాలను సందర్శించి, భక్తులతో మాట్లాడారు. “మీరు కూలుస్తున్నది కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు… మా విశ్వాసం, మా ధర్మం,” అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈటల రాజేందర్ ఏమన్నారంటే:
“తెలంగాణ ఉద్యమం నాడు జగద్గిరిగుట్టలో ఎందరో పోరాడారు. ఇప్పుడు ఇక్కడి ప్రజల విశ్వాసాలను కించపరిచేలా ప్రభుత్వ చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ అధికారులు పేదల గుళ్లను కూల్చేందుకు చూస్తున్నారు. కానీ ఇదే ధైర్యం హైటెక్ సిటీలో 50 ఎకరాల భూమిని కబ్జా చేసిన వారిపై చూపించగలరా?” అని ప్రశ్నించారు.
బుచ్చమ్మ ఆత్మహత్య – ప్రభుత్వమే బాధ్యుడు:
ఈటల మాట్లాడుతూ, నల్లచెరువు దగ్గర బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. “హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలుస్తున్నారు, దేవాలయాలను ముట్టడిస్తున్నారు. ఇది తగదు. ప్రజలు దీనికి గట్టిగా స్పందిస్తారు,” అని హెచ్చరించారు.
దేవాలయాలకు నోటీసులు రద్దు చేయాలి:
ఈటల “దేవాలయాలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి” అంటూ ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు. “పేదల మీద, వారి విశ్వాసాల మీద ప్రభుత్వం అణచివేత చర్యలు ఆపాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెప్తారు,” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శేఖర్ యాదవ్, గిరివర్ధన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుధాకర్, ప్రవీణ్, మహేందర్, రమేష్, శంకర్, స్థానిక భక్తులు, పూజారులు పాల్గొన్నారు.
— Zindagi9News
