“అంతిమ యాత్ర – ఒక్క రూపాయి సఫర్ పథకానికి రెండేళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలి”
కరీంనగర్:
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ (ఐఏఎస్) నిర్లక్ష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఒక్క రూపాయి అంతిమ యాత్ర – సఫర్ పథకం కింద పని చేస్తున్న కార్మికులకు గత రెండేళ్లుగా లక్షల రూపాయల బకాయిలు చెల్లించకుండా, విచారణ పేరుతో ఆలస్యం చేయడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మేయర్ రవీందర్ సింగ్ ముందుకు తెచ్చిన ఈ పథకం నిరుపేదలకు ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు.
కుటుంబ సభ్యులను కోల్పోయిన పేద ప్రజలకు ఆఖరి ప్రయాణాన్ని సౌకర్యంగా చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా సేవలందిస్తున్న ఎస్సీ కార్మికులను అవమానించడమే కాకుండా, వారి జీవనాధారాన్ని నిలిపివేయడమని పేర్కొన్నారు.
వెంటనే కార్మికులకు బకాయిలు చెల్లించి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని, సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
– Zindagi9News

