
ఎలి లిల్లీ రూ.9 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో విస్తరణ
ప్రపంచ ఫార్మా రంగంలో ప్రముఖమైన ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co) తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ రూ.9,000 కోట్ల పెట్టుబడి (ఒక బిలియన్ డాలర్లు) ప్రకటించింది.
ఈ మేరకు సంస్థ ప్రతినిధులు — ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, ఇండియా ప్రెసిడెంట్ విన్స్లో టూకర్ తదితరులు — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి తెలంగాణపై సంస్థ ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలుపుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ఫార్మా హబ్గా నిలిచిందని, ప్రపంచ దృష్టి కూడా ఇప్పుడు తెలంగాణపై ఉందని చెప్పారు.
1965లో ఇందిరాగాంధీ హైదరాబాద్కు ఐడీపీఎల్ తీసుకురావడం ఫార్మా రంగానికి మలుపు తిప్పిందని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్లో 40 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని తెలిపారు.
ఎలి లిల్లీ విస్తరణతో కెమిస్టులు, సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్లకు విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
అమెరికాకు చెందిన ఈ సంస్థకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. డయాబెటిస్, ఒబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధుల వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఔషధ సేవలను అందిస్తోంది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ, ఇటీవల హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను ప్రారంభించింది.
పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో తెలంగాణ ఫార్మా రంగం మరింత బలపడనుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
