
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఆర్.కే. సాగర్ దూకుడైన నాయకత్వంలో యువ నాయకుడు బోళ్ల కార్తీక్ అధికారికంగా జనసేన పార్టీలో చేరారు. ఈ చేరికతో జిల్లాలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ప్రజాసేవే లక్ష్యంగా, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానానికి ఆకర్షితుడై జనసేన గూటికి చేరిన బోళ్ల కార్తీక్ నిర్ణయం, ఇప్పటివరకు కొనసాగిన అధికార రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయంగా మారుతున్న జనసేన ప్రస్థానానికి మరో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా యువతలో బలమైన ప్రభావం కలిగిన నాయకుడి చేరికతో జిల్లాలో పార్టీ బలం గణనీయంగా పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా ఆర్.కే. సాగర్ మాట్లాడుతూ,
“ప్రజల్లో నిలకడగా పనిచేసే నాయకులు ఒకొక్కరుగా జనసేన వైపు రావడం సహజం. ఇది ఎవరి వ్యూహం కాదు… ప్రజల తీర్పు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇకపై రాజకీయాలు పాత పద్ధతుల్లో సాగవు” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా బోళ్ల కార్తీక్ మాట్లాడుతూ,
“అధికారమే లక్ష్యంగా చేసే రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజల గౌరవం, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్న జనసేనలో ఉండటమే నా బాధ్యత. మాట కాదు… పని ద్వారా సమాధానం ఇస్తాను” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ చేరికతో రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారనుందని, జనసేనను ఇకపై తేలికగా తీసుకునే పరిస్థితి లేదన్న సంకేతం బలంగా వెళ్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
