కరీంనగర్: తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం డీఏలు, జీపీఎఫ్, మెడికల్, గ్రాట్యుటీ పేరిట రూ. 8,200 కోట్ల బకాయిలను చెల్లించలేకపోవడం దారుణమన్నారు.
కరీంనగర్లో ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల కోసం రూ. 11 వేల కోట్లు మంజూరు చేయలేని దుస్థితి వచ్చింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లబోతున్నాయి” అని అన్నారు.
అలాగే, “తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర కీలకం. కానీ, ఇప్పుడు వాళ్లకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా వేధిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలను 60 లక్షలు తగ్గించే కుట్ర జరుగుతోంది. ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తే జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీసీలు నష్టపోయినట్లే” అని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో త్వరలోనే మార్పు రావడం తథ్యమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
