హుజురాబాద్: రాములోరి కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్న భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారుల ఆదేశానుసారం, హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి.
ఈ నెల 4వ తేదీ నుండి 16వ తేదీ వరకు షిఫ్టుల వారీగా వైద్య సిబ్బంది విధుల్లో పాల్గొంటారని, డిప్యూటేషన్ పై సిబ్బందిని కేటాయించారని అధికారులు తెలిపారు. శిబిరంలో ముఖ్యంగా పాము కాటు వ్యాక్సిన్, కుక్క కాటు వ్యాక్సిన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎన్సీడీ స్క్రీనింగ్, అబా కార్డుల జనరేషన్ కూడా చేపడతారు.
శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం, టీబీపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అత్యవసర పరిస్థితుల కోసం 108 సర్వీసు అందుబాటులో ఉంటుంది. అనుకోని ప్రమాదాల్లో ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైతే పై స్థాయి ఆసుపత్రికి తరలింపు కూడా ఏర్పాటు చేశారు.
ఈ వైద్య శిబిరాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ చందు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, శ్యామల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్లు పంజాల ప్రతాప్ గౌడ్, మోహన్ రెడ్డి, సూపర్వైజర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్స్ శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
