
అల్ఫోర్స్ ఇ-టెక్నోలో ఘనంగా హిందీ దివస్ వేడుకలు – హిందీ ఉపాధ్యాయులకు సన్మానం
కరీంనగర్, సెప్టెంబర్ 13: అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ముందస్తు జాతీయ హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ భాష ప్రాచీన దేవనాగరి లిపి నుండి ఆవిర్భవించిందని, ఆ భాషలోని మాధుర్యం కారణంగానే జాతీయ భాషగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. హిందీ భాష ద్వారా దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పోటీ పరీక్షల్లో సైతం హిందీ ప్రావీణ్యం ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు.
హిందీ భాషలో పర్షియన్, అరబిక్, సంస్కృత పదాలు విస్తారంగా ఉన్నాయని, భారత ఉపఖండంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటని గుర్తుచేశారు. తులసీదాస్, కబీర్, నిర్మల్ వర్మ, కమలేశ్వర్ వంటి మహాకవులు, రచయితల సాహిత్యం విద్యార్థుల్లో ఆలోచనాత్మకతను పెంచుతుందని చెప్పారు.
హిందీ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న హిందీ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఆలపించిన పలు హిందీ రచనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
