విద్యారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ — “విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడం ద్వారానే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండగలదని, సమాజంలో వివిధ రంగాల్లో వారు ఘనవిజయాలు సాధించగలరని విశ్వసిస్తున్నాను” అని తెలిపారు.
1991 నుండి తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో సేవలందిస్తున్నానని పేర్కొంటూ, ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయికి వరకు విద్యార్థులకు నాణ్యతైన విద్యను అందించడమే మా లక్ష్యం అని చెప్పారు. వివిధ పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయడంలో తమ సంస్థల ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమని తెలిపారు.
అంతేకాక, “ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యా విధానాలను అమలు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం, విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా మేము రాష్ట్ర విద్యారంగానికి తోడ్పడుతున్నాం” అని తెలిపారు.
అబ్దుల్ కలాం కి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అని పేర్కొంటూ, విద్యాసంస్థల అభివృద్ధిలో తోడ్పడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
వారం రోజుల వ్యవధిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల ఉమ్మడి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఈ అవార్డు తనపై బాధ్యతను మరింతగా పెంచిందని చెప్పారు.
డాక్టర్ నరేందర్ రెడ్డి కృషి పట్ల రాజకీయ ప్రముఖులు, విద్యా రంగ ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, సాంస్కృతిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ, ఆయన రానున్న రోజుల్లో మరిన్ని చారిత్రాత్మక అవార్డులను గెలుచుకొని తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి దీపస్తంభంగా నిలవాలని ఆకాంక్షించారు.
