జమ్మికుంట : ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నివారించేందుకు జమ్మికుంట పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్ లేని వాహనాలు, రెజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న వాహనదారులను గుర్తించారు. ముఖ్యంగా మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతున్న ఘటనలను పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో సీఐ వరంగంటి రవి మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. వాహనంతో బయటకు వచ్చేటప్పుడు RC, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలి. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడాన్ని పూర్తిగా నివారించాలి.” అని స్పష్టం చేశారు.
ఇది మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 25,000 జరిమానా మరియు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని హెచ్చరించారు.
ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, తల్లిదండ్రులు, యువత ఈ సూచనలను పాటించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
