హైదరాబాద్: ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పూర్తి పారదర్శకతతో అమలు చేసి, అతి నిరుపేదలకే గృహాలు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, పలు కీలక సూచనలు చేశారు:
ముఖ్యమంత్రి సూచనలు:
🔹గ్రామస్థాయిలో ఏర్పాటైన ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల ఎంపికను జాగ్రత్తగా చేయాలి. ఈ జాబితాను తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్లతో కూడిన మండల స్థాయి బృందం పరిశీలించి ధృవీకరించాలి.
🔹అనర్హులకు ఇండ్లు కేటాయించబడినట్టు తేలితే, వెంటనే ఆ వివరాలను కమిటీకి తెలియజేసి, అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలి.
🔹అవకతవకలకు తావు లేకుండా పథకాన్ని అమలు చేయాలి. ఎవరైనా దందాలకు పాల్పడితే తక్షణమే కేసులు నమోదు చేసి, నిధుల రికవరీ చేయాలని ఆదేశించారు.
🔹లబ్ధిదారుల సౌకర్యార్థం 50 శాతం అదనపు నిర్మాణానికి అవకాశం కల్పించాలి.
🔹సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలి.
“ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదల జీవితం మారుస్తుంది. కాబట్టి ప్రతి ఇంటి వెనుక న్యాయం ఉండాలి. అర్హులకే ఇండ్లు దక్కేలా, అవకతవకలు జరగకుండా పథకాన్ని అమలు చేయాలి” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
