
కరీంనగర్ : కొత్తపల్లి అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహా లింగార్చన కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై వేదమంత్రాల నడుమ జ్యోతి ప్రజ్వలనతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహాన్ని నింపుతాయని, సమాజానికి నూతన శోభను తీసుకువస్తాయని తెలిపారు. ప్రతి ఏడాది లింగార్చనను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనందకరమని పేర్కొన్నారు.
వేదికను చక్కగా అలంకరించి 108 మట్టితో తయారు చేసిన లింగాలకు ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. ఫలాలు, పూలు, పంచామృతాలతో ఘనంగా అభిషేకాలు చేసి మహా హారతి సమర్పించారు. సుమారు 30 పైగా నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. రుత్వీకులు విద్యార్థులకు ఆశీర్వచనాలు అందించారు.
వేడుకలలో భాగంగా భజనలు, గేయాలు కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
