గోల్డెన్ అవర్లో చికిత్సే ప్రాణ రక్షణకు కీలకం: మెడికవర్ వైద్యులు
జమ్మికుంటలో ట్రామా కేర్పై అవగాహన సదస్సు
ప్రమాద బాధితులను తొలి గంటలోనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని సూచన

జమ్మికుంట, జూలై 22 (Zindagi9News): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి వైద్య నిపుణులు తెలిపారు. బుధవారం జమ్మికుంటలో ట్రామా కేర్ (అత్యవసర వైద్యం)పై నిర్వహించిన అవగాహన సదస్సులో వారు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ దిలీప్ రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, ప్రమాద బాధితులకు ప్రాథమిక చికిత్స అందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అన్ని వైద్య విభాగాలు ఒకేచోట అందుబాటులో ఉన్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెంటనే తరలిస్తే సమగ్ర చికిత్స అందించి ప్రాణాలను రక్షించడం సులభమవుతుందని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం అమూల్యమని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే రోగిని మృత్యువు నుంచి కాపాడగలవని వైద్యులు పేర్కొన్నారు. మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, మనోజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
