కరీంనగర్ కమిషనరేట్లో ఆంక్షలు కొనసాగింపు
జూలై 31 వరకు డీజేలు, డ్రోన్లపై నిషేధం.. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

కరీంనగర్, జూలై 3(Zindagi9news): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పలు ఆంక్షలను జూలై 31 వరకు పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఐపీఎస్ తెలిపారు. ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాల వినియోగంపై కూడా జూలై 31 వరకు నిషేధం విధించినట్లు తెలిపారు. ప్రత్యేక అనుమతి లేకుండా వీటి వినియోగం నిషేధమని స్పష్టం చేశారు.
అలాగే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు చిన్నారులు, విద్యార్థులు, వృద్ధులు, రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీజే సౌండ్ సిస్టమ్లపై నిషేధాన్ని కూడా జూలై 31 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
