జమ్మికుంట ఫ్లైఓవర్పై భారీ గుంతలు.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న రహదారి

జమ్మికుంట, జూలై 4 (Zindagi9news):
జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డుపై గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు కనిపించకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రతిరోజూ వందలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు మరమ్మతులు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ గుంతలను వెంటనే పూడ్చి, ఫ్లైఓవర్ రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు రోడ్లు–భవనాల (R&B) శాఖ అధికారులను కోరుతున్నారు.
